ఎస్టీపీ నిర్మాణ పనులను పరిశీలించిన జలమండలి ఎండీ

హైదరాబాద్ (CLiC2NEWS): ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్ – 3లో భాగంగా ఫతేనగర్లో నిర్మిస్తున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పనులను శుక్రవారం జలమండలి ఎండీ దానకిశోర్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన స్పష్టం చేశారు. దసరాలోపు ఎస్టీపీ నిర్మాణం పూర్తయ్యేందుకు గానూ 24 గంటల పాటు పనులు జరపాలని, ఇందుకోసం 3 షిఫ్టుల్లో కార్మికులు పని చేసేలా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో పనులు జరుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సరిపడా వెలుతురు ఉండేలా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్మాణ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్మికులు కచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.