ఆసుపత్రిలో చేరిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ
జైపూర్ (CLiC2NEWS): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ శనివారం జోధ్పూర్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఐసియూలో చేరారు. ఆయన కాలేయ సంబంధిత వ్యాధి, మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్నారు.
ఆశారాం బాపూ గత ఐదు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వసయస్సు 80 సంవత్సరాలు. ఆశారాం బాపుకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి 48 గంటల పాటు వైద్యుల పరిరక్షణలో ఉంచనున్నారు.
ప్రస్తుతం ఆశారాం బాపూ అత్యాచారం కేసులో జోధ్పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదుగా ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక 2013లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జోధ్పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది 2014లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
ఇప్పుడు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అతను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నెలకు ఒకటి లేదా రెండుసార్లు AIIMS జోధ్పూర్కు తీసుకువస్తారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆశారాం బాపు జైలు నుంచి బయటకు వెళ్లకముందే, ఆయన్ను జోధ్పూర్ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారనే సమాచారంతో ఆయన అభిమానులు, భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారిని పోలీసులు బలవంతంగా ఆ ప్రాంతం నుంచి పంపించారు.