అసెంబ్లీ, మండలి సోమవారానికి వాయిదా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. సంతాప తీర్మానాల అనంతరం శాసన సభ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి.
ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు సభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు.
అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం మొదలైంది. సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారుపై చర్చిస్తున్నారు. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.