కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్?

న్యూఢిల్లీ (CLiC2NEWS): మరికొద్ది గంటల్లో కేంద్ర మంత్రి వర్గం రూపురేఖలు మారనున్నాయి. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు. ప్రధాన మంత్రి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి విస్తరణలో భారీ మార్పులు జరుగనున్నాయి. ఈ విస్తరణలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్ మినిస్టర్ కానున్నట్లు తెలుస్తోంది.
కిషన్రెడ్డితో పాటు అనురాగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరి, పుషోత్తం రూపాలా, మనుసుఖ్ మాండవీయలను కేబినెట్లోకి తీసుకునే సంకేతాలు కన్పిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ప్రధాన మంత్రి నివాసానికి రావాలని ఇప్పటికే వీరికి ఆహ్వానం అందింది. దీంతో వీరు ఇవాళ ఉదయం లోక్కల్యాన్ మార్గ్కు వెళ్లి ప్రధాని మోడీని కలిశారు.
పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్ దక్కనున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే కొత్తగా మంత్రులుగా ప్రయాణ స్వీకారం చేయబోయే వారితో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు.