నగరంలో విజయవంతంగా మాక్ డ్రిల్..

హైదరాబాద్ (CLiC2NEWS): భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మంగళవారం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం 244 జిల్లాల్లోని 259 లోకేషన్లలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ నిర్వహించే ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటిదానిలో ఢిల్లీ, ముంబయి, సూరత్ , వడోదర,చెన్నై ,కల్పకం, నరోరా ఉండగా.. రెండో విభాగంలో హైదరాబాద్ , విశాఖపట్టణం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడో విభాగంలో 45 జిల్లాలు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానం గురించి ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జిహెచ్ ఎంసి పరిధిలో పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది. ఒక వేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డి ఆర్ ఎఫ్ సిబ్బంది వివరించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. మొత్తంగా 12 శాఖల అధికారులు సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ను నిర్వహించారు.
మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్ధాలు వినబడటం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలో కాల్పులు జరిగితే .. అక్కడ చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడం వంటి దృశ్యాలను ప్రదర్శించారు. కాల్పుల్లో గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించే అంశాలపై అవగాహన కల్పించారు.