అక్ర‌మంగా న‌ల్లా క‌నెక్ష‌న్ తీసుకున్న‌ వ్య‌క్తిపై క్రిమిన‌ల్ కేసు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): జ‌ల‌మండ‌లి తొల‌గించిన‌ న‌ల్లా క‌నెక్ష‌న్‌ను మ‌ళ్లీ అక్ర‌మంగా తీసుకున్న‌ ఒక వ్య‌క్తిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజ‌న్ – 1లోని మొఘ‌ల్‌పురా సెక్ష‌న్ ప‌రిధిలో గ‌ల లాల్‌ద‌ర్వాజ‌లో నివ‌సించే ద‌త్తారి ప్ర‌సాద్ అనే వ్య‌క్తి నివాసానికి గ‌తంలో న‌ల్లా కనెక్ష‌న్ ఉండేది. కానీ, 1992 సెప్టెంబ‌ర్‌ 21న జ‌ల‌మండ‌లి ఈ క‌నెక్ష‌న్‌ను తొల‌గించింది. అయినా కూడా తొల‌గించిన‌ 15 ఎంఎం పైపు సైజు గ‌ల న‌ల్లా క‌నెక్ష‌న్‌ను అక్ర‌మంగా పున‌రుద్ధ‌రించుకున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగం అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్‌ను తొల‌గించింది. అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్ క‌లిగి ఉన్న ద‌త్తారి ప్ర‌సాద్‌పైన శాలిబండ పోలీస్ స్టేష‌న్‌లో యు/ఎస్ 430, 269, 379 ఐపీసీ, పీడీపీపీ సెక్ష‌న్ల‌ కింద‌ కేసు న‌మోదు చేశారు.

అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్ర‌మంగా న‌ల్లా క‌నెక్ష‌న్లు తీసుకునే యాజ‌మానితో పాటు క‌నెక్ష‌న్‌కు స‌హ‌క‌రించిన ప్లంబ‌ర్‌, ఇత‌ర వ్య‌క్తుల‌పై కూడా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని తెలిపారు.

ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.

Leave A Reply

Your email address will not be published.