క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుంది: ధనుష్

చెన్నై (CLiC2NEWS): ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ. 10కోట్ల పరువు నష్టం దావ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఓ దంపతులకు నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ తమ మూడో కుమారుడని, సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడంటూ మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. నటుడిగా స్థిరపడిన నాటి నుంచి ధనుష్ తమకు ప్రతి నెలా రూ. 65 వేలు పంపిస్తున్నారని ఆ దంపతులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో విసిగిపోయిన ధనుష్, ఆయన తండ్రి కస్తూరిరాజా.. తాజాగా ఆ దంపతులకు లీగల్ నోటీసులు పంపించారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తోన్న ఆరోపణలకు ఇకనైనా పుల్స్టాప్ పెట్టాలని కోరారు. ఇంతకాలం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ క్షమాణలు చెబుతూ ఓ స్టేట్మెంట్ని వెంటనే విడుదల చేయాలని ధనుష్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.