ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన తమిళ సర్కార్..

చెన్నై (CLiC2NEWS): భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాత్రి నుంచి చెన్నై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోండి అని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలు ఇప్పటికీ పీకల్లోతు నీటిలో నానుతున్నాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాలని.. వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు 17 గంటలైనా వర్షం ఆగే సూచనలు కనపడటం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా చోళవరంలో 22 సెంటీమీటర్లు, గుమ్మిడిపూండీలో 18 సెంటీమీటర్లు, ఎన్నూర్లో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. కోస్తా తీర ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాను వాను ముంచెత్తుతున్నాయి. ఈక్రమంలో ఇవాళ, రేపు నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారులను కేటాయించారు కలెక్టర్ చక్రధర్ బాబు.