ఆఫీసుల్లో మొబైల్ ఫోన్స్ వాడొద్దు.. మద్రాసు హైకోర్టు
చెన్నై (CLiC2NEWS): ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఆఫీసు పనివేళల్లో మొబైల్ ఫోన్స్ను ఉపయోగించకూడదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓకేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిచాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్ ఎం సుబ్రమణియమ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
తిరుచునాపల్లి హెల్త్ రీజనల్ వర్క్షాప్ విభాగంలో పనిచేస్తున్న ఓవ్యక్తి ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎంత హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్పై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది.
“ఆఫీసుల్లో మొబైల్ ఫోన్లు వినియోగిస్తుండటం, ఫోన్లలో వీడియోలు తీయడం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఇవన్నీ తోటి ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగించడమే గాక, ప్రభుత్వ ఆఫీసు కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రభుతవం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలి. మొబైల్ ఫోన్లను వీలైతే స్విఛాఫ్ చేయాలి. లేదా వైబ్రేషన్ / సైలెంట్ మోడ్లో పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకొని ఆఫీస్ నుండి బయటకు వెళ్లి మాట్లాడి రావాలి” అని హైకోర్టు స్పష్టం చేసింది.