ధర్మపురి పట్టణంలోకి చేరిన వరద నీరు
ధర్మపురి (CLiC2NEWS): గతవారం రోజులనుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని జలాశాయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగాయి. ఎగువన కురిసిన వర్షాలతో పాటు అతి భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. దీంతో భారీగా వరద నీరు ధర్మపురి వీధుల్లోకి ప్రవేశించింది. దీంతో పలుకాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పలువురు ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేశారు. బీర్పూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి వరద తీవ్రతకు అక్కడి స్మశానం పూర్తిగా మునిగిపోయింది. వర్సాల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ధర్మపురి పరిస్థితిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయం పర్యవేక్షించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నిర్వాతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.