India Corona: 40 వేలు దాటిన కేసులు
కేరళకు కేంద్ర బృందం
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో వరుసగా రెండో రోజు 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 43,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే 22వేల కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు నమోదవుతుండటంతో అక్కడి సర్కార్ వారాంతపు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం కేరళలోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల బృందాన్ని పంపనుంది.
అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మళ్ళీ కరోనా ఉధృతి కనిపిస్తోంది. ఆసుపత్రులలో కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించకపోవడమే అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా గుంపులుగా సంచరించడం, మాస్కులు ధరించకపోవడం అలాగే శుభకార్యాలు, ఉత్సవాలులలో నిబంధనలు పాటించకుండా పాల్గొనడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ కరోనా థర్ఢ్ వేవ్ కు దారితీసేలా ఉన్నాయని వారు అంటున్నారు. దేశంలో 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గాంధీ ఆసుపత్రికి రోజుకు 30కి పైగా కేసులు వస్తున్నాయని అధికారులు తెలియజేశారు. కేసుల పెరుగుదల ఇలాగే ఉంటే మూడోదశను ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నింబంధనలు అందరూ పాటించాలని.. అలాగే మాస్కులు అందరూ తప్పని సరిగా ధరించాలని వారు సూచిస్తున్నారు.