బంగారంపై రుణాలు.. ఆర్బిఐ నూతన మార్గదర్శకాలు..

RBI: బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఆర్బిఐ తన మార్గదర్శకాలను సవరించినట్లు సమాచారం. పసిడి రుణాల విషయంలో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు ఒకే తరహా నిబంధనలు ఉండాలనే ఉద్దేశంతో ఆర్బిఐ ముసాయిదా మార్గదర్శకానలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రుణదాతలు ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ (జిఎంఎఫ్) యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీలుపడదు.
బంగారం నాణ్యతతో పాటు, తాకట్టు తేదీకి తొలి 30 రోజుల్లొ సగటు ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ముందురోజు ముగింపు ధర ప్రకారమైనా రుణ గ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్వొచ్చన్నది లెక్కించాల్సి ఉంటుంది.
బంగారంపై రుణం రూ2.5 లక్షల కంటే తక్కువ ఉంటే వారికి లోన్-టు-వాల్యూ (ఎల్టివి) 85%గా ఆర్బిఐ నిర్ణయించింది.
తీసుకునే రుణం రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకు 80%.. రూ.5లక్షలు దాటిన రుణాలకు 75% ఎల్టివిగా ఆర్బిఐ నిర్ణయించింది.
తాకట్టు పెట్టే బంగారం వస్తువల రూపంలో ఉంటే ఒక కేజి.. వెండి అయితే 10 కెజిలకు మించకూడదు.
గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్ 50 గ్రాములకు, వెండి కాయిన్స్ అయితే 500 గ్రాములకు మించకూడదు.
బంగారం పై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తే.. అదే రోజు తాకట్టు పెట్టిన
బంగారాన్ని తిరిగి ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో గరిష్టంగా ఏడు పని దినాలకు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
రుణదాతకు, రుణ గ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సి వివరాలను ఆర్బిఐ స్పష్టం చేసింది.