ఉక్రెయిన్లో మెడిసిన్ చదివే తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): ఉక్రెయిన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త తెలిపారు. భారతీయ విద్యార్థులు ఎంతో మంది ఉక్రెయిన్లో మెడిసిన్ చదవుతున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వారంతా స్వదేశానికి తరలివచ్చారు. అయితే వారి చదువు విషయం అగమ్యగోచరంగా మారింది. ఉక్రెయిన్లో ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయో.. భారతీయ విద్యార్థులు ఇకపై అక్కడ వైద్యవిద్యను కొనసాగించడం ఎలా.. అనే సందేహాలు విద్యార్ధుల్లో తలెత్తుతున్నాయి.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులందరి చదువు కావాల్సిన ఖర్చును భరించి విద్యార్థులందరరూ ఇక్కడే మెడిసన్ చదివే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 740 మందికి పైగా తెలంగాణ బిడ్డలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, వీరందరూ ఉక్రెయిన్కు చదువుకోసం వెళ్లారని తెలిసిందని సిఎం అన్నారు. ఉక్రెయిన్లో రూ. 25 లక్షల్లో మెడిసిన్ పూర్తవుతుందని, మనదగ్గర రూ. కోటి అడుగుతున్నారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించలేక అక్కడ చదువుకుందామని వెళ్లారు. ఇక్కడ సరైన అవకాశాలు లేక అక్కడికి వెళ్తున్నారని తెలిసిందని కెసిఆర్ అన్నారు.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. అక్కడి పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో తెలియని పరిస్థితి. విద్యార్థుల భవిష్యత్పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై భారత ప్రభుత్వానికి లేఖ రాస్తామని, అన్ని ఖర్చులు భరిస్తూ 740 మందికిపైగా తెలంగాణ బిడ్డలు ఇక్కడే మెడిసిన్ చదివేలా ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు,. వారి భవిష్యత్తు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని , సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సిఎం ఆదేశించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకొని చదువులు మధ్యంతరంగా వదిలేసి వచ్చిన తెలంగాణ విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించి.. చదివిస్తుంది – అసెంబ్లీలో సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/CpxrKHBB3H
— TRS Party (@trspartyonline) March 15, 2022