ఎపిలో జనగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2027లో దేశ వ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దంన్నర అనంతరం దేశంలో జనగణన చేపడుతున్నారు. దీని కోసం గత నెలలో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్నే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. 2027 మార్చి 1 నుండి దేశ వ్యాప్తంగా జనగణను కానున్న నేపథ్యంలో అదే రోజు రాష్ట్రంలోనూ జనగణన ప్రక్రియ ప్రారంభకానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు.
భారత్లో దశాబ్దానికి ఒకసారి చేపట్టాల్సిన జనగణన తొలిసారి ఆలస్యమైంది. 2021లో చేపట్టాల్సిన జనగణన ఆలస్యమైంది. జనాభా గణన అంటే కేవలం జనాభా లెక్కించడం మాత్రమే కాదు.. రాష్ట్రాలకు నిధులను కేటాయించడం నుండి స్కూల్స్ను ఏర్పాటు చేయడం, ఎన్నికల సమయంలో నియోజక వర్గాల సరిహద్దులను విభజించడం వరకు ప్రతి నిర్ణయంలో కేంద్రం ఈ డేటానే వినియోగిస్తుంది.