జోన్-3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు, మిరాలం ఎస్టీపీ పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ (CLiC2NEWS): మెట్రో నగరాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, కానీ హైదరాబాద్ మహానగరానికి మాత్రం తాగునీటి సమస్య అనేది లేదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
నగరంలో ఉత్పత్తవుతున్న మురుగునీటిని 100 శాతం శుద్ధి చేయడమే లక్ష్యంగా జలమండలి ఆధ్వర్యంలో రూ.3,800 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ఎస్టీపీల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పలు ఎస్టీపీల నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇందు భాగంగా ప్యాకేజ్ – 2లో రూ.121.19 కోట్ల వ్యయంతో, 41.5 ఎంఎల్డీ సామర్థ్యంతో మిరాలంలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పనులకు సైతం ఆయన శంకుస్థాపన చేశారు.
మూసీనదికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థ ఆధునికీకరణ కోసం జోన్ – 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులకు కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్ – 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టింది.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ, జలమండలి ఎండీ దానకిశోర్, ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కోర్ సిటీలోని జోన్ – 3లో సీవర్ నెట్వర్క్
మూసీ నదికి ఉత్తరాన జీహెచ్ఎంసీ కోర్ సిటీలోని 33.50 చదరపు కిలోమీటర్ల ప్రాంతం జోన్ – 3 పరిధిలోకి వస్తుంది.
జోన్ – 3 సీవరేజ్ నెట్వర్క్ ప్రాజెక్టు డీపీఆర్ను ముంబైకి చెందిన షా టెక్నికల్ కన్సల్టెంట్స్ అనే సంస్థ రూపొందించింది.
జోన్ – 3లో తొమ్మిది పరివాహక ప్రాంతాలు ఉంటాయి. మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్ 1 నుంచి ఎన్ 7 వరకు, ఎన్ 11, ఎన్ 31 పరివాహక ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఇక్కడ 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్ నెట్వర్క్ ఉంది..
ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతంలో 93.18 కిలోమీటర్ల పొడవైన ల్యాటరల్స్ నిర్మాణం జరగనుంది. 200 ఎంఎం నుంచి 300 ఎంఎం డయాతో కూడిన ఎస్డబ్ల్యూజీ పైపులతో ల్యాటరల్స్ నిర్మాణం జరుగుతుంది. 36.14 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ సీవర్ మెయిన్స్ నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది. 400 ఎంఎం నుంచి 1200 ఎంఎం డయా ఆర్సీసీ ఎన్పీ4 క్లాస్ పైపులతో ట్రంక్ సీవర్ మెయిన్స్ నిర్మాణం జరుగుతుంది. మొత్తంగా జోన్ – 3లో 129.32 కిలోమీటర్ల సీవరేజ్ పైప్లైన్ నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది.
జోన్ – 3 సీవరేజ్ ప్రాజెక్టు చేపట్టడానికి ప్రభుత్వం 30.03.2022 నాడు రూ.297 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నెంబర్ 167 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను జీవో ఆర్టీ నెంబర్ 21 ద్వారా 13.01.2022 నాడు ప్రభుత్వం ఏజెన్సీకి అప్పగించింది. 04.03.2022 నాడు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఈ ఒప్పందాన్ని నిర్ధారించింది.
II. కీలక అంశాలు
1. ప్రాజెక్టు వ్యయం – రూ.297 కోట్లు
2. నెట్వర్క్ మొత్తం పొడవు – 129.32 కి.మీలు
ఆర్సీసీ ట్రంక్ సీవర్ – 400-1200ఎంఎం – 36.14 కి.మీలు
ఎస్డబ్ల్యూజీ నెట్వర్క్ – 200-300ఎంఎం – 93.18 కి.మీలు
3. మురుగు ప్రవాహం అంచనా:
2036 నాటికి – 127.42 ఎంఎల్డీ
2051 నాటికి – 153.81 ఎంఎల్డీ
4. జనాభా అంచనా:
2036 నాటికి – 6.33 లక్షలు
2051 నాటికి – 10.20 లక్షలు
III. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు:
టోలిచౌకి, గోల్కొండ, లంగర్హౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్(కొంత భాగం), మెహదీపట్నం, నానల్నగర్, ఆసిఫ్ నగర్, విజయ్నగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకపూల్, బజార్ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్, తదితర ప్రాంతాలు.
IV.ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు:
- సీవరేజ్ వ్యవస్థ పరిధి పెరుగుతుంది.
- ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది.
- ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతంలో నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు.
- ఈ ప్రాంతంలో మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
- ప్రాజెక్టు పురోగతి: పైపుల తయారీ / సేకరణ జరుగుతోంది.
- ప్రాజెక్టు కాలపరిమితి: రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది.