దీర్ఘకాలం కలిసి ఉంటే వివాహం జరిగినట్లే: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దీర్ఘకాలం పాటు ఒక మహిళ, ఒక పురుషుడు సహజీవనం చేస్తే వారి మధ్య ఉన్న బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందని.. దాన్ని అక్రమ సంబంధంగా భావించదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. అలాంటి జంటకు పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
కేసు వివరాలు.. ఒక జంట దీర్ఘకాలంగా సహజీవనం చేసింది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే వీరు పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేకపోవడం వల్ల వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని కేరళ హైకోర్టు 2009వ సంవత్సరంలో తీర్పును వెలువరించింది.
కాగా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది..
“ఒక జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సాగారంటే వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 114 ఈ మేరకు సూచిస్తోంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్పించే వారి తప్పించే వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలి“ అని కోర్టు పేర్కొంది.
దీనిపై ఎవరైనా సవాల్ చేయవచ్చని కోర్టు తెలిపింది. అయితే వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత.. ఇలా సవాల్ చేసిన వారపైనే ఉంటుందని కూడా కోర్టు స్పష్టం చేసింది.