ముంచుకొస్తున్న మిచౌంగ్ తుపాను..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగ్జాం తుపాను ప్రభావంతో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం రన్వే పైకి వదరనీరు చేరుకుంది. భారగా వరద నీరు చేరుకోవడంతో విమానాశ్రయంలో విమాన రాకపోకలు అంతరాయం ఏర్పాడింది. మరోవైపు నాలుగు రైళ్లరాకపోకలు సైతం అధికారులు రద్దు చేశారు.
పశ్చిమ బంగాళా ఖాతంలో మిగ్జాం తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతున్నట్లు సమాచారం. రేపు ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో మిగ్జాం తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది.చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ. బాపట్ల తీరాలకు 300 కి.మీ దూరంలో మిగ్జాం తుపాను కేంద్రీకృతమైంది. కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువగా రావటంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.