IRCTC: భారత్ గౌరవ్ రైలు.. రూ.11వేలకే శబరిమల యాత్ర..

హైదరాబాద్ (CLiC2NEWS): అయ్యప్పస్వామి దర్శనానికి శబరిమల వెళ్లాలనుకునే భక్తుల కోసం ఐఆర్సిటిసి ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 16వ తేదీ నుండి 20 వ తేదీ వరకు మొత్తం నాలుగు రాత్రుళ్లు, ఐదు పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. పుణ్యక్షేత్రాలు , ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుండి విశేష స్పందన రావడంతో శబరిమల యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ , పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషనలలో ఈ రైలు ఎక్కేందుకు అవకాశం కల్పించారు.
శబరిమల యాత్ర కోసం ఏర్పాటు చేసిన ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి నవంబర్ 16 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కేరళలోని చెంగనూర్ చేరుకుంటుంది. అక్కడ దిగి రోడ్డు మార్గంలో నీలక్కళ్కు తీసుకెళ్తారు. అక్కడి నుండి సొంతంగా కేరళ ఆర్టిసి బస్సుల్లో పంబ వరకు వెళ్లాల్సి ఉంటుంది. మూడో రోజు దర్శనం, అభిషేకం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు నీలక్కళ్ నుండి చోటానిక్కర / ఎర్నాకుళం వచ్చి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం 7 గంటలకు చోటానిక్కర అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఎర్నాకుళం టౌన్లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయల్దేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45 గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఈ రైలులో మొత్తంగా 716 సీట్లు ఉన్నాయి. స్లీపర్ 460, థర్డ్ ఎసి 206, సెకండ్ ఎసి 50 సీట్లు ఉన్నాయి. ప్యాకేజి ఛార్జీల వివరాలు
ఎకానమి () ఒక్కో టికెట్ ధర రూ.11,475, 5-11 ఏళ్ల లోపు చిన్నారులకు రూ. 10,655.
స్టాండర్డ్ (3) .. రూ. 18,790, 5-11 చిన్నారులకు రూ.17,700
కంఫర్ట్ (2).. రూ.24,215, 5-11 చిన్నారులకు రూ.22,910
ఉదయం టి, టిఫిన్, మధ్యాహ్నం , రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే ప్రయాణికులే చెల్లించుకోవాలి
ప్యాకేజికి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్సిటిసి టూరిజం వెబ్సైన్ను సందర్శించగలరు.