జలమండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలిలో తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జలమండలి అధికారులు, ఉద్యోగులు, వినియోగదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నమైన బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమవుతూ.. జలమండలి సేవలను మరింత మెరుగుపరిచేందుకు పునరంకితం కావాలని ఆయన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.