స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కమలా: ప్రధాని మోడీ

వాషింగ్టన్‌ (CLiC2NEWS): భార‌త్‌-అమెరికా స‌హ‌జ భాగస్వాములు అని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ప్ర‌పంచంలోని రెండు అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశాలు ఒకే ర‌క‌మైన విలువ‌లు, భౌగోళిక‌మైన రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉన్నాయ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు.

దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉధృతి సమయంలో సహకరించిన అమెరికాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ను ప్రధాని మోడీ భారత పర్యటనకు ఆహ్వానించారు.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చరిత్రాత్మకమని ప్రధాని అన్నారు. ప్రపంచానికి కమలా హారిస్‌ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తని చెప్పారు. బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని ఆశిస్తున్నాన్నారు. ప్రపంచం కఠినమైన సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో ప్రెసిడెండ్‌ బైడెన్‌, మీరు అధికారంలోకి వచ్చారు. అయినప్పటికీ చాలా తక్కువ సమయంలో కరోనాను అదుపుచేయడంతోపాటు చాలా విజయాలు సాధించారని మోదీ అన్నారు.

అమెరికాకు భారత్‌ చాలాముఖ్యమైన భాగస్వామి అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ‘కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్‌ వనరుగా ఉంది. కరోనా ఉధృతిలో భారత్‌కు సహకరించినందుకు గర్వంగా ఉంది. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నారు. విదేశాలకు మళ్లీ టీకాలు ఎగుమతి చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమైన విషయం. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మ‌న దేశాల‌పై ఉందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.