డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లను ప్రారంభించిన కెటిఆర్
టోల్ ఫ్రీ నంబర్ 155313

హైదరాబాద్ (CLiC2NEWS): స్వచ్ఛ హైదరాబాద్ దిశగా మరో ముందడుగు పడింది. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జలమండలి ప్రయత్నిస్తోంది. క్రమంలో భాగంగా డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ పి.వి. నర్సింహ రావు మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద శనివారం 87 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వీటితో పాటు ఆయన జలమండలి ఉప్పల్ లోని నల్ల చెరువులో నూతనంగా నిర్మించిన ఎఫ్ఎస్టీపిని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ వాహనాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 155313కు డయల్ చేయొచ్చు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో టెక్నాలజి ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మినీ ఎయిర్ టెక్ మిషన్లను రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన జలమండలి ప్రస్తుతం ఎఫ్ఎస్టీపిల నిర్మాణంతో మరో మైలు రాయిని అందుకుందని అన్నారు. ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లోపలి గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంక్ మానవ వ్యర్థాలను శుద్ధి చేసి ఇటు పర్యావరణానికి అటు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఎఫ్ఎస్టీపిల ను రూపకల్పన చేసారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఉత్పన్నమయ్యే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోసి ఇటు పర్యావరణానికి హాని చేస్తూ అటు ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే పరిస్థితి ఉండేదని అన్నారు. దీన్ని నివారించడానికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుభ్రపరిచే వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ వాహనాల ఆపరేటర్లకు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చామని.. వీరు నగరంలోని సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ప్రతిపాదిత ఎఫ్ఎస్టీపిలలో డంపింగ్ చేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు.
జలమండలి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు ఎఫ్ఎస్టీపిలు నిర్మిస్తుండగా, వీటిలో ఒకటి నేడు ప్రారంభించామని, మరో రెండు కూడా వినియోగంలోకి వస్తే మానవ వ్యర్థాలను చెరువుల్లో, కుంటల్లో వేసే పరిస్థితి ఉండదని ఆయన వివరించారు. అంతేకాకుండా చాలా తక్కువ ధరలో ప్రజలకు ఈ సేవలను అందిస్తున్నామని అన్నారు. సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లకు, కార్మికులకు త్వరలోనే హెల్త్ కార్డులు కూడా అందజేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి ఎఫ్ఎస్టీపీ లను హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలో మరో 71 ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
ఎఫ్ఎస్టీపీ ల నిర్మాణం.. నిర్వహణ..
జలమండలి ఓఆర్ఆర్ పరిధిలోని 7 కార్పొరేషన్ లు, 18 మున్సిపాలిటీ లు, 18 గ్రామ పంచాయితీల్లో తాగునీటి సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతాల్లో జలమండలి తన సేవలను మరింత విస్తరించే క్రమంలో నూతనంగా, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను తరలించే వాహనాలతో పాటు.. ఎఫ్ఎస్టీపిల (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) నిర్మాణం ప్రారంభించింది. ఇందులో భాగంగానే జలమండలి ఇప్పటికే ఉన్న ఎస్టిపిలు మరియు ప్రతిపాదిత ఎఫ్ఎస్టిపిల వద్ద సెప్టిక్ వ్యర్థాలను రవాణా, డంపింగ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సహకారంతో 87 మంది సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లను ఎంపిక చేసింది. వీరికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల యొక్క నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా విధి నిర్వహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా సామాగ్రితో పాటు, కార్మికులకు ప్రత్యేక యూనిఫాం ను కూడా అందజేసింది.
ప్రస్తుతం అంబర్ పేట్, నల్లచెరువు, పెద్దచెరువు, మిరాలం ట్యాంక్, ఖాజాగూడ, నానక్ రామ్ గూడ, నాగోల్ మరియు ఖాజకుంటలలో ఉన్న ఎస్టిపిల వద్ధ.. 80 కెఎల్డి (కిలో లీటర్ పర్ డే) సామర్థ్యం గల, 8 కో-ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. ఇప్పటికే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఇవి శుద్ధి చేస్తున్నాయి.
హైదరాబాద్ నల్ల చెరువు వద్ద ఆస్కీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సహకారంతో 40 కెఎల్డి సామర్థ్యం గల ఒక నూతన ఎఫ్ఎస్టిపి ని నిర్మించారు. నాగారం మరియు ఇంజాపూర్ ల వద్ద 20 కెఎల్డి సామర్థ్యం గల మరో రెండు ఎఫ్ఎస్టిపిలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ, క్లీనింగ్ కోసం జలమండలి డయల్-ఎ-సెప్టిక్-ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను గౌరవ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం 155313/14420 కు కాల్ చేసి వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చు.
ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మేల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, జలమండలి ఎండీ దాన కిషోర్, ఈడీ డా. సత్యనారాయణ, జలమండలి డైరెక్టర్ల తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.