రాయలసీమ హార్టికల్చర్ హబ్గా కుప్పం: సిఎం చంద్రబాబు
కుప్పం (CLiC2NEWS): చిత్తూరు జిల్లాలో ఎపి సిఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో రూ.1,292.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా తుమ్మిశిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సిఎం మాట్లాడుతూ.. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గం నిలవబోతుందన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని.. అది తలచుకుంటే భయమేస్తోందన్నారు.
కుప్పంలో రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని.. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పనిలేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పిఎం సూర్యఘర్ కింద మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి బిసిలకు రూ.98వేల రాయితీ ఇస్తామన్నారు.
కుప్పంలో రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు చేపట్టామని సిఎం తెలిపారు. రూ.3829 కోట్లతో హంద్రినీవా ద్వారా చివరి ఆయకట్టుకు నిళ్లిస్తామన్నారు. కుప్పం-హోసూరుకు సమాంతరంగా మరో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కుప్పం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజి ఇస్తామన్నారు. రూ.వెయ్యి కోట్లతో పలమనేరు-కృష్ణగిరి మధ్య 4 వరుసల రోడ్డు నిర్మాణం చేపడతామని సిఎం వెల్లడించారు.