హైదరాబాద్లో రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
పబ్లు, బార్లు కూడా మూసివేత: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసుల నిర్ణయం

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. శోభాయమానంగా జరిగే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి చెదురుమొదురు సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఎక్సైజ్ పోలీసులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని వైన్స్, బార్లు, పబ్లు సెప్టెంబర్ 19, 20వ తేదీల్లో మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 20న సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, పబ్లను మూసి వేయనున్నట్లు ప్రకటన జారీ చేశారు.