Lockdown: తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించం : సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS):తెలంగాణలో ఎట్టి ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ విధించ‌బోమ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌త అనుభవాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసుల సంఖ్య త‌గ్గ‌డం లేద‌న్నారు. లాక్‌డౌన్‌తో ప్ర‌జాజీవనం స్తంభించిపోతుంద‌ని.. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే అవ‌కాశం ఉంద‌న్నారు. కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నినిర్వహించారు.

రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. క‌రోనా చికిత్స‌, నియంత్ర‌ణ చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధానంగా స‌మీక్షించారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సీజన్, రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద‌రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్‌కు కొవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన న‌గ‌రం మీద భారం పెరిగిపోయిందన్నారు. తెలంగాణ జనాభాకు అద‌నంగా 50 శాతం కరోనా రోగులు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్ మీద ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడిసివర్ మంటి మందుల లభ్యత భారం పడుతున్నదని ప్రధానికి తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజ‌న్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని తెలిపిన సీఎం దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4,900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25,000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా అవసరం మరింతగా ఉంద‌న్నారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు ప్రతిరోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి కేసీఆర్‌ విజ్జప్తి చేశారు.

కాగా సీఎం కేసీఆర్ విజ్జప్తి మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. ప్ర‌ధానికి కేసీఆర్‌ విన్నవించిన అంశాల మేర‌కు సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన్లు, రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. రెమిడిసివర్ తయారీ సంస్థలతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సిజ‌న్ బెడ్లు ఉన్నాయని వీటికి తోడు మరోవారం రోజుల్లో 5 వేల బెడ్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. మెరుగైన ఆక్సిజ‌న్ సరఫరా కోసం ఒక్కోటి రూ. కోటి చొప్పున 12 క్రయోజనిక్ ట్యాంక‌ర్ల‌ను చైనా నుంచి వాయుమార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు.

కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్యాధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సీఎం తెలిపారు. దీనికి డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్యశాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం అన్నారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎంల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని సీఎం తెలిపారు.

ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, సీఎస్‌ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎంవో కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హైల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.