16 మంది చిన్నారులను రక్షించిన మేడిపల్లి పోలీసులు
హైదరాబాద్ (CLiC2NEWS): చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 16 మంది చిన్నారులను రక్షించారు. రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ. 4.50 లక్షలకు ఆర్ ఎంపి డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఇందుకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేయగా ముఠాగుట్టు రట్టయింది. వీరిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నెల నుండి 2 ఏళ్ల లోపు చిన్నారులను పిల్లలు లేనివారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లి, పుణె నుండి చిన్నారులను తీసుకొచ్చిఅమ్ముతున్నారు. తల్లిదండ్రుల నుండి రూ. 50 వేలకు కొనుగోలు చేసి.. రూ. 1.80 లక్షల నుండి రూ. 5.50 లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నట్లు సమాచారం.