నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు మృతి!

నిర్మల్ (CLiC2NEWS): పెళ్లైన మరుసటి రోజే వదూవరుల కుటుంబంలో విషాదం నిండింది. కలకాలం కలిసి ఉండాలని పెళ్లి చేసుకున్న ఆ జంట ఆశలు ఒక్క రోజులోనే ఆవిరయ్యాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో పెండ్లి వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక, ఆమె తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు. పెండ్లి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతులు కడెం మండల పరిధిలోని మద్దిపడగ గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర బల్లర్షాలోని రాజురాకు రిసెప్షన్ కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 10 నిమిషాలలో ఇళ్లు చేరుకుంటామనే సమయంలో పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం పాండవ పూర్ బిడ్జిని ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.