ఒమిక్రాన్ వ్యాప్తి.. వచ్చే 4 వారాలు కీలకం
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే 2 నుండి 4 వారాలు కీలకమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు వ్యాపించిందని, మనదేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఇది థర్డ్ వేవ్కు సంకేతమని స్పష్టం చేశారు.
తెలంగాణలోమూడోవేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.