ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ప్రభంజనం దిశగా ఆప్, దూసుకుపోతున్న బిజెపి.. డీలా పడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఐదు రాష్ట్రాల్లో ఇవాళ (గురువారం) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లలో అసెంబ్లీ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ అయిదు రాష్ర్టాల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యుపి ఫలితాలపై అందరి దృష్టి ఉంది. మొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు జరిగింది. అనంతరం ఇవిఎంలలో నమోదైన ఓట్ల కౌంటింగ్ మొదలెట్టారు.
- యుపిలో 403 స్థానాలు,
- పంజాబ్ లో 117 స్థానాలు
- ఉత్తరాఖండ్లో 70 స్థానాలు
- గోవాణలో 40 స్థానాలు
- మణిపూర్లో 60 స్థానాల లకు ఎన్నికలు జరిగాయి.
పంజాబ్లో దూసుకెళ్తున్న ఆప్..
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ డీలా పడింది. పాటియాల అర్భన్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సిఎం అమరీందర్ సింగ్ ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడి నుంచి బరిలో ఉన్న ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక లంబీ నుంచి పోటీ చేసిన శిరోమనీ అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా వెనుకంజలో ఉన్నారు. అలాగే పంజాబ్ సిఎం చరణ్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. చౌమ్కౌర్ సాహిబ్, బహదూర్ అసెంబ్లీ స్థానాలలో సిఎం రెండు చోట్ల వెనుకంజలో ఉన్నారు. అలాగే అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీచేసిన నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా వెనుకంజలో ఉన్నారు.
డీలా పడ్డకాంగ్రెస్..
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లలో అసెంబ్లీ ఓట్లను లెక్కింపులో కాంగ్రెస్ చతికిల పడింది.
ఉత్తరప్రదేశ్లో అధికార భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ఇక్కడ రెండో స్థానంలో ఎస్పీ ఉంది.
పంజాబ్లో ఆప్ ప్రభంజనం దిశగా సాగుతోంది.
ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో బిజెపి జోరు కొనసాగుతోంది. యుపిలో బిజెపి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. పోటీ చేసిన ప్రతీ రాష్ట్రంలో ఎక్కడ దూకుడు ప్రదర్శించలేక పోతోంది. అధికారంలో ఉన్న పంజాబ్లో కనీసం 20 స్థానాల్లో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.