ప్రభుత్వ అధికారి ఇంటి కిటికీ నుండి నోట్ల వర్షం..

భువనేశ్వర్ (CLiC2NEWS): ఆదాయానికి మించి అక్రమ ఆస్థులు కూడబెట్టిన ఓ ప్రభుత్వ అధికారి ఇంటికి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ అధికారి నోట్లను కిటికీ నుండి బయటకు విసిరేశాడు. అది గమనించిన స్థానికులు నిశ్చేష్టులయ్యారు. ఈ ఘటన ఒడిశా లోని భువనేశ్వర్లో రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ సారంగి ఇంటివద్ద చోటుచేసుకుంది.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఆరోపణల మేరకు వైకుంఠనాథ్ కు చెందిన ఏడు ప్రాంతాల్లో విజెలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 26 మంది అధికారులు పాల్గొన్నారు. తన ఇంట్లో దాచిన సొమ్ము ఎక్కడ బయటపడుతుందోనని వైకుంఠనాథ్ నోట్లను కిటికీనుండి బయటకు విసిరాడు. కిటికీనుండి నోట్లు పడటం గమినించిన స్థానికులు అవాక్కయ్యారు. ఆ సొమ్మునంతా ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాలలో భాగంగా మొత్తం రూ.2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం