జో బైడెన్తో ప్రధాని మోడీ భేటీ
వాషింగ్టన్ (CLiC2NEWS): అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోడీ ధ్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి.
శ్వేతసౌధంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జోబైడన్ మాట్లాడుతూ..
భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం కావాలన్నారు. కోవిడ్ సమస్యలపై కలిసి పనిచేస్తామని బైడన్ తెలిపారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం కలిసి పోరాడతామని పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త శకం మెదలు అవుతుందని జో బైడెన్ వెల్లడించారు. ఇరు దేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలక పాత్రపోషించనుందన్నారు. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లాభాదాయకం అని బైడెన్ సృష్టం చేశారు. 40 లక్షల మంది ఇండో-అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోడీ తో ఆన్నారు.
వాణిజ్య భాగస్వామ్యం బలోపేతం కావాలి: మోడీ
అనంతరం మోడీ మాట్లాడుతూ.. ఈ శతాబ్దం మూడో దశాబ్దం ప్రారంభంలో జరుగుతున్న ఈ ద్వైపాక్షిక సమావేశం ఎంతో కీలకమైనందన్నారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారత్-అమెరికా వాణిజ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Meeting @POTUS @JoeBiden at the White House. https://t.co/VqVbKAarOV
— Narendra Modi (@narendramodi) September 24, 2021