క్యాతనపల్లిలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఉదయం 7 గంటల నుండి బుధవారం సాయంత్రం 8గంటల వరకు (17-02-2026 నుండి 18-02-2026) సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
163 బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్ అమలు సమయంలో ఎక్కడైనా నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటుచేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చట్టపరమైన అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకో లు, ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఎవ్వరు కూడా కర్రలు, కత్తులు, తుపాకులు లేదా ఎలాంటి మారణాయుధాలతో సంచరించడం పూర్తిగా నిషేధమని సిపి తెలిపారు. మైకులు, లౌడ్స్పీకర్ల ద్వారా పాటల ప్రసారం చేయకూడదన్నారు.చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే విధమైన ప్రకటనలు, ప్లకార్డులు, గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు, కేంద్ర బలగాలు, హోమ్గార్డులు మరియు ఎస్పీఓలకు ఈ నిషేధాలు వర్తించవని స్పష్టం చేశారు.