Olympics: సిల్వర్ మెడల్తో మెరిసిన రవి దహియా
టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్ రెజ్లింగ్లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో భారత్ పతాకం మరోసారి ఒలింపిక్స్లో రెపరెపలాడింది. గురువారం పురుషుల 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రెజ్లర్ జవుర్ ఉగుయెవ్ చేతిలో రవి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్లో రజతం సాధించిన 2వ భారత రెజ్లర్గా అతడు ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
గతంలో 2012 ఒలింపిక్స్లో సుశీల్కుమార్ రెజ్లింగ్లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన రవి దహియా ఏకంగా ఫైనల్ చేరి ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకు ఇది ఐదో మెడల్ కావడం విశేషం.
రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన జవుర్ ఉగుయెవ్ 57 కిలోల కేటగిరీలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్. గతేడాది డిసెంబర్లో బెల్గ్రేడ్లో జరిగిన వరల్డ్కప్లో గెలిచాడు. గత 15 టోర్నమెంట్లలో అతడు 14 మెడల్స్ గెలిచాడు. అందులో 12 గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం.