ఘోరం: సమస్యలపై ప్రశ్నించిన వ్యక్తిని ఎగిరి తన్నిన సర్పంచ్..

మర్పల్లి (CLiC2NEWS): గ్రామ సమస్యల్ని పరిష్కరించి.. అభివృద్ధికి బాటలు వేస్తాడని ఎన్నో ఆశలతో ఓటేసి ఎన్నుకున్న గ్రామస్తులకు బూటు కాలితో తన్నులు సమర్పిస్తున్నాడు ఓ సర్పంచ్. ఈ వికృతమైన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… జిల్లాలోని మర్పల్లి మండలం దామస్తపూర్లో ఓ వ్యక్తిపై సాక్షాత్తు ఆ గ్రామ సర్పంచ్ దాడి చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను సర్పంచ్ జైపాల్రెడ్డి కాలితో ఎగిరి తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే సర్పంచ్ దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపించారు.
“గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. నీరు.. డ్రైనేజి సమస్య వంటివాటి మీద దృష్టి పెట్టాలని“ దామస్తాపూర్ సర్పంచ్కు పిట్టల శ్రీనివాస్ మొరపెట్టుకున్నాడు. అక్కడే 2 రోజుల క్రితం జరిగిన ఒక గొడవ కోసం పంచాయితీ పెట్టిన సర్పంచ్ జైపాల్ రెడ్డి.. “నీకెందుకు రా“ అంటూ కొట్టడం.. బూటుకాలితో బురదలో వేసి తనడం మొదలు పెట్టాడు.
దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సర్పంచ్ మీద ఫిర్యాదు చేశాడు. మర్పల్లి SI వెంకట శ్రీనుకు ఫిర్యాదును సమర్పించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.