ఈ నెల 31న పనిచేయనున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఈనెల 30, 31న ఉగాది, రంజాన్ సందర్బంగా పబ్లిక్ హాలిడే ఉన్న సంగతి తెలిసిందే. కానీ.. తెలంగాణలో మార్చి 31న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ ఆర్ ఎస్) ఫీజు చెల్లింపునకు 31 వరకు అవకాశం కల్పించాలని వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎల్ ఆర్ ఎస్ అమల్లో భాగంగా .. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ ఆర్ ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. ఈ నెల 31న బ్యాంకులు కూడా పనిచేయనున్నందున ఆరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. నేరుగా రిజిస్ట్రార్ ఆఫీసులోనే క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. 31లోపు ఫీజు చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది.