రాఘవకు 14 రోజుల రిమాండ్..

కొత్తగూడెం (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేసిన వనమా రాఘవను పోలీసులు కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుపర్చారు. అతడికి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడిని భద్రాచలం సబ్జైలకు తరలించారు.
అంతకు ముందు ఈ కేసుకు సంబంధించి ఎఎస్పీ రోహిత్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
“ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి తానూ నిప్పంటించుకున్నారు. ఘటనా స్తలిలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్ద కుమార్తె సాహితీ మృతి చెందింది. ఈ నెల 3న రామకృష్ణ బావమరిది జనార్థన్ ఫిర్యాదుతో పాల్వంచ పోలీస్ స్టేషన్లో 302, 307, 06 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో, సూసైట్ నోట్లో వనమా రాఘవపై ఆరోపణలు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయని తెలిపారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే చనిపోతున్నట్లు తెలిపారు. రాఘవను దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను నిన్న రాత్రి అరెస్టు చేశాం. పలు అంశాలపై విచారించాం. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించారు. అధారాలను కోర్టు అందజేశాం. నిందుతులను ఇవాళ కొత్తగూడెం మేజిస్ర్టేట్ ముందు హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి. “ అని ఎఎస్పీ రోహిత్రాజ్ చెప్పారు.