అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో అధికారుల వైఖరిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అధికారలు పట్టించుకోవడం లేదని మండిపడింది. రెండు వేర్వేరు కోర్టు ధిక్కరణ కేసుల్లో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. దంత వైద్య కాలేజీలో ఒప్పంద ప్రతిపదికన పనిచేస్తున్న ఉద్యోగి తనకు 2018 నుండి జీతం ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేసింది. జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అధికారులు అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో విచారణ సందర్భంగా.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తేనే అధికారులు స్పందించి పనులు చేస్తున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సిఎంఒ కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, హెల్త్ యూనివర్సిటి విసి బాబ్జి కోర్టుకు హాజరయ్యారు. ఒప్పంద ఉద్యోగికి పూర్తి వేతనం చెల్లించకుండా.. కొంత మొత్తం ఎలా ఇస్తారని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ఇన్నేళ్లు జీతం ఇవ్వకపోతే ఆమెకు జీవనోపాధి ఎలా అని.. ఆమె ఉద్యోగం వడిలేసి వెళ్లి పోయేవిధంగా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికారులు ఈ విధంగా చేస్తే కో్ర్టు ధిక్కరణ కింద ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి జైలుకు పంపించాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది.