పెట్టుబడుల పేరుతో రూ.24 కోట్లు కాజేసిన నిందితులు అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): పెట్టుబడి పెట్టండి.. రెండింతలు ఇస్తాం.. అంటూ కొంత మంది ప్రజల దగ్గర నుండి డబ్బులు కాజేస్తారు. బాధితులు లబోదిబోమంటారు. అయినా, మళ్లీ మళ్లీ అలాంటివారు వస్తూనే ఉంటారు. మళ్లీ ప్రజలు వారిని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. ఇదే తరహాలో తాజాగా నగరంలో బైబ్యాక్ పేరుతో పెట్టుబడులు పెట్టమని.. ఏకంగా రూ.24 కోట్లు కొట్టేశారు. నగదు కాజేసిన నిందితులను హైదరాబాద్ ఆర్ధిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
బైబ్యాక్ పేరుతో రూ.17 లక్షలు పెట్టబడి పెడితే.. 100 నెలలపాటు ప్రతి నెలా రూ.30వేలు ఇస్తామని ఆకర్షించారు. దీనికి అదనంగా పలు ప్రాంతాల్లో స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలికారు. ఆ భూమిలో గంధపుచెట్లు నాటి 13-15 ఏళ్లకు 50శాతం వాటా ఇస్తామని అన్నారు. దీంతో 120 మంది పెట్టుబడులు పెట్టారు. మొదటి రెండు నెలలు వారు చెప్పిన విధంగా రూ.30వేలు జమ చేశారు. ఆ తర్వాత నుండి డబ్బులు చెల్లించడం ఆపేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం రూ.24కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.