ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్రం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కెటిఆర్ అన్నారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సిఐఐ తెలంగాణ వార్షిక సదస్సుకి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. టిఆర్ ఎస్ ఏడున్నరేండ్ర పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలకు చేరిందని తెలిపారు.
దేశంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్ధిక వ్యవస్థ మనదేనని అన్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం ఆవిష్కరణలు, స్టార్టప్లను బాగా ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో ఎన్నో స్టార్టప్లు వచ్చి విజయవంతంగా నడుస్తున్నాయి అన్నారు. టిఎస్ ఐపాస్ బాగా విజయవంతమైనదని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, 500 మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న పరిశ్రమలకు సత్వర అనుమతి ఇస్తున్నామని కెటిఆర్ తెలిపారు.