ప్రీతి మృతి

నిమ్స్ ఆసుప‌త్రిలో అర్థ‌రాత్రి వ‌ర‌కు ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్ (CLIC2NEWS ):
వైద్య విద్యార్థిప్రీతి గ‌త ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం అర్థ‌రాత్రి మృతి చెందారు. సీనియ‌ర్ వేధింపులు త‌ట్టుకోలేక వ‌రంగల్ ఎంజిఎంలో ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన పిజి విద్యార్థికి నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో ఆదివారం రాత్రి 9.10 గంట‌ల‌కు ప్రాణాలు విడిచిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. సీనియ‌ర్ విద్యార్థి కొంత కాలంగా వేధించ‌డంతో ఈ నెల 22వ తేదీన హానిక‌ర‌మైన ఇంజెక్ష‌న్ తీసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి య‌త్నించారు. అప‌స్మార‌క స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వ‌రంగ‌ల్ ఎంజిఎంలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం త‌ర్వాత హైద‌రాబాద్‌లోని నిమ్స్‌కు త‌ర‌లించారు. ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యులు ఎంత‌గాశ్ర‌మించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలు కాపాడ‌టానికి ఎంత య‌త్నించినా స‌ఫ‌లం కాలేద‌ని మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ నిమ్మ స‌త్య‌నారాయ‌ణ ఆదివారం రాత్రి ప్ర‌క‌టించారు.

కాగా ప్రీతి మృతి పై ముఖ్య‌మంత్రి కెసిఆర్‌స్పందించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని సిఎం చెప్పార‌ని, రూ. 10 ల‌క్ష‌ల ప‌రిహారాని్ని ప్ర‌క‌టించారని మంత్రి ఎర్ర‌బెల్లి వెల్ల‌డించారు.

నిమ్స్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌!
ఆదివారం అర్థ‌రాత్రి వ‌ర‌కు నిమ్స్ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్తంగా మారింతి మెడిక‌ల్ క‌ళాశాల అన‌స్థీయా హెచ్ ఓడిని స‌స్పెండ్ చేసిన త‌ర్వాతే, సిట్టింగ్ జ‌ర్జితో మృతిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు. అలాగే త‌న కూతురు ప్రీతి ఎలా చ‌నిపోయిందో పూర్తి నివేదిక కావాల‌ని తండ్రి న‌రేంద‌ర్ కోరారు.

ఈ నేప‌థ్యంలో ప్రీతి మృత‌దేహాన్ని అంబులెన్స్‌లో త‌ర‌లించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌గా.. కుటుంబ స‌భ్యులు, విద్యార్థి, గిరిజ‌న సంఘాల నాయ‌కులు అడ్డ‌గించారు. ఈ సంద‌ర్భంగా నిమ్స్ ఆసుప‌త్రి వ‌ద్ద అర్థ‌రాత్రి వ‌ర‌కు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

మ‌రోవైపు ప్రీతి త‌ల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. దీంతో ప్రీతి మృత‌దేహాన్ని శ‌వ‌ప‌రీక్ష‌కు త‌ర‌లించేందుకు వారు ఒప్పుకోవ‌డంతో గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాంధీ ఆసుప‌త్రి కి వెళ్ల‌కుండా ప్రీతి బంధువులు పోలీసుల‌ను అడ్డుక‌న్నారు.. శ‌వ ప‌రీక్ష‌కు త‌మ‌కు అనుమతించాల‌ని వారు డిమాండ్ చేశారు.

శ‌వ‌ప‌రీక్ష పూర్తి అయిన అనంత‌రం పోలీసు భ‌ద్ర‌త మ‌ధ్య కుటుంబ స‌భ్యుల‌కు ప్రీతి మృత‌దేహాన్ని అప్ప‌గించారు. అన‌తంరం ప్రీతి మృత‌దేహాన్ని వారి స్వ‌గ్రామం జ‌న‌గామ‌జిల్లా కొడ‌కండ్ల మండ‌లంలోని గిర్ని తండాకు త‌ర‌లించారు. భారీ బందోబ‌స్తు మ‌ద్య ప్రీతి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.