రాజీవ్ హత్యకేసు దోషి.. పెరారివాలన్ను రిలీజ్ చేయండి..
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ (CLiC2NEWS): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు ఇవాళ (బుధవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దాదాపు ముప్పయేల్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి. పెరారివాలన్ను విడుదల చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, బిఆర్. గవాయి, ఎఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశం చేసింది.
ఆర్టికల్ 161 మేరకు గవర్నర్ తన అధికారాలను వినియోగించకుండా.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతి కి సిఫారసు చేయవచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఆర్టికల్ 142 ప్రకారం ఆ నిందితుడిని రిలీజు చేయడం సమంజసమే అని లావు నాగేశ్వరరావు ధర్మాసనం అభిప్రాయపడింది.
1991లో మే 21 తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ధను అనే మహిళ ఆత్మహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ కేసులో 1998లో ఏడుగురిని దోషులుగా తేలుస్తు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. ఈకేసులో రాజీవ్ హత్యకు వాడిన బాంబు పరికరాలను పరారివాలన్ అంజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో పరారివాలన్ వయస్సు 19 యేళ్లు.
ఆ మరుసటి సంవత్సరం పెరారివాలన్, సహా మురుగన్, నళిని, శాంతన్ మరణ శిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో వీరి మరణ శిక్ష జీవిత ఖైదుగా తగ్గింపు చేసింది.