సెప్టెంబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ జెండా పండుగ: కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 2 నుంచి టిఆర్ ఎస్ జెండా పండగ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అలాగే సెప్టెంబరు 2న ఢిల్లీలో టిఆర్ ఎస్ భవనానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబరు 2-12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామకం, సెప్టెంబరు 12-20 వరకు మండల, పట్టణ కార్యవర్గాల నియామకం, సెప్టెంబరు నెలాఖరుకు అన్ని కార్యవర్గాల నియామకాలు పూర్తి చేయనున్నట్లు కెటిఆర్ వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అని కేటీఆర్ తెలిపారు.
51 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తాం. సోషల్ మీడియాకు సంబంధించి కమిటీలు వేయాలని నిర్ణయించాం. మండల, పట్టణ, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
బాబు మినామీ ఇష్టం వచ్చిన్టుల మాట్లాడితే సహించాలా?: కెటిఆర్
ఈ సమావేశంలో టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “ఎవరూ దిక్కు లేక చంద్రబాబు తొత్తు, బినామీని కాంగ్రెస్ దిగుమతి చేసుకుంది. డబ్బు సంచులతో దొరికిపోయినొన్ని అధ్యక్షుడిని చేశారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నోరు పారేసుకుంటున్నాడు“ అని మంత్రి ధ్వజమెత్తారు.
“రాజకీయాల్లో ఉన్నవారు సంస్కారవంతంగా మాట్లాడాలి.. తెలంగాణను సాధించిన నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల నాయకుడు, ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా..? మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా లోపల పడేశారు. మల్లారెడ్డికి జోష్ ఎక్కువ.. ఒక మాట అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మినందుకు యాత్ర చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఆస్తుల అమ్మకం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు“ అని ప్రతిపక్ష నేతలపై కెటిఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.