TS: ఎల్లుండి నుంచి స్కూల్లు, కాలేజీలకు సెలవులు
ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని పాఠశాలలు, జూనియర్ కాళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ అధికారులతో సిఎం సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.