TS Corona: తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ ను పొడిగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. మంత్రులందరితో మంగళవారం సీఎం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రులందరి అభిప్రాయ సేకరణ అనంతరం లాక్డౌన్ను పొడిగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు.
అదేవిధంగా కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు.
రాష్ట్రంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు
- వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
- తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
- వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
- విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
- జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
- జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
- కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
- ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
- ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
- గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
- అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి
- అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
- తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
- కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.
- సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.