ఈ నెల 20న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల జూలై కోటా విడుదల
తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రకటించింది. జులై నెల కోటాకు చెందిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్లో టికెట్లు మంజూరు చేస్తారు. టికెట్లు పొందిన భక్తులు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటాను ఈ నెల 20 న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈనెల 25న విడుదల చేయనున్నారు. అదే విధంగా శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
జులై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 21న,
వయోవృద్ధులు, దివ్యాంగులు.. ఉచితంగా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టెకెన్ల కోటాను 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఈ నెల 24 ఉదయం .. జూన్ నెల కోటాను 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 26 ఉదయం తిరుమలలో మే నెల గదుల కోటా.. 27న తిరుపతిలో గదుల కోటాను విడుదల చేయనున్నారు.
భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి ప్రకటించింది.