మంచిర్యాల జిల్లాలో రైలు ఢీకొని ఇద్దరు మృతి
మంచిర్యాల (CLiC2NEWS): రైలు గేటు పడినా రైలు వచ్చేలోపు కింది నుండి దాటి వెళిపోవచ్చులే అనుకొని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్లో బుధవారం ఇద్దరు వ్యక్తులు భూక్య సురేశ్, కుంభాల చందర్ మృత్యువాత పడ్డారు. వీరిద్దరూ ద్విచక్రవాహనంపై రామకృష్ణాపూర్ వెళ్తూ క్యాతనపల్లి రైల్వే గేటు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రక్కనున్నవారు ఎంతగా వారిస్తున్నా వినకుండా గేటు కిందనుండి బైక్ను దాటడానికి ప్రయత్నించారు. ఇంతలో రైలు ఢీకొట్టింది. సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చందర్ మృత దేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో ఇరుక్కుని 3 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.