సీనియర్ నటి జయంతి కన్నుమూత

బెంగళూరు (CLiC2NEWS): ప్రముఖ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల స్వాస సంబంధిత సమస్యతో బెంగళూరులోని విక్రమ్ దవాఖానలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు.
దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయంతి.. 1945 జనవరి 6న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతోపాటు హిందీ, మరాఠీ సినిమాలతో కలిపి 5 వందలకుపైగా సినిమాల్లో నటించారు.
1960లో యానై పాగన్ అనే తమిళ సినిమాతో మొదటిసారి బాల నటిగా వెండితెరకు పరిచయమయ్యారు.కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి జయంతికి హీరోయిన్గా మొదటి అవకాశం ఇచ్చారు. ఆయనే ఆమె పెరున జయంతిగా మార్చారు. ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం `జెనుగూడు`.
తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్ చక్రవర్తి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, రక్త సంబంధం, భక్త ప్రహ్లాద, బడిపంతులు, దేవదాసు, మాయదారి మల్లిగాడు, స్వాతి కిరణం, పెదరాయుడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దిగ్గజ నటులు ఎంజీ రామచంద్రన్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్లతో కలిసి నటించారు. ఉత్తమ నటిగా రెండుసార్లు కర్ణాటక ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. జయంతి మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.