తిరుమల: నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల (CLiC2NEWS): కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరోనా కేసులు నమోదు సంఖ్య తగ్గుతుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి కూడా ఎక్కువగానే వుంది.
కాగా తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ కారణంగా ఈ మూడు రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా, నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
కాగా తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీఐపీల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేసినట్టు టిటిడి తెలిపింది