మేము విడిపోతున్నాం: నాగచైతన్య, సమంత

హైదరాబాద్‌ (CLiC2NEWS): యువ కథానాయకుడు నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య, సమంత సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో టాలీవుడ్ రూమ‌ర్స్‌కు బ్రేక్ ప‌డింది.
ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ డైవ‌ర్స్ స్టేట్మెంట్‌ను రిలీజ్ చేశారు. ఇద్ద‌రం ఒక‌రికి ఒక‌రు దూరం ఉండాల‌నుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. స‌మంత‌తో సంప్ర‌దింపుల త‌ర్వాత ఇద్ద‌రం వేరుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని నాగ చైత‌న్య త‌న ట్వీట్‌లో తెలిపారు. త‌మ కెరీర్‌ల‌పై దృష్టి పెట్టాల‌నుకుంటున్న‌ట్లు నాగ్ చెప్పారు. దాదాపు ద‌శాబ్ధ కాలం పాటు త‌మ మ‌ధ్య స్నేహం కొన‌సాగింద‌ని, అదే త‌మ మ‌ధ్య బంధాన్ని బ‌ల‌ప‌రిచిన‌ట్లు చైత‌న్య తెలిపాడు. అది ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిద‌న్నాడు. క్లిష్ట త‌ర‌మైన స‌మయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా స‌హ‌క‌రించాల‌ని చైతూ త‌న ట్వీట్‌లో కోరాడు. త‌మ‌కు ప్రైవ‌సీ ఇవ్వాల‌ని వేడుకున్నాడు. స‌మంత కూడా త‌న ట్విట్ట‌ర్‌లో చైతూతో విడిపోతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

అక్కినేని కుటుంబం నుంచి నట వారసుడిగా ‘జోష్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగచైతన్య. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తండ్రి బాటలోనే ఓ మంచి రొమాంటిక్‌ లవ్‌స్టోరీ చేయాలనుకున్నారు. ఆ క్రమంలో పట్టాలెక్కిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ఈ సినిమాలో కథానాయికగా సమంత తెలుగు, తమిళ తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో పనిచేసేటప్పుడే సమంత, నాగచైతన్యల మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. దాంతో ఇరు కుటుంబాలు సామ్‌-చైతూల పెళ్లికి ఓకే చెప్పడంతో  2017అక్టోబరు 6న హిందూ వివాహ పద్ధతిలో, అక్టోబరు 7న క్రిస్టియన్‌ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు. కాగా ప‌బ్లిక్‌లో మంచి క్రేజీ జంట‌గా పేరున్న క్ర‌మంలో వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు అక్టోబరు 2, 2021న సామాజిక మాధ్యమాల వేదికగా నాగ‌చైత‌న్య‌- స‌మంత ప్రకటించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు నాగచైతన్య-సమంత కలిసి 4 సినిమాల్లో నటించారు ‘ఏమాయ చేసావె’ వారి తొలి చిత్రం కాగా, ‘మనం’, ‘ఆటోనగర్‌ సూర్య’ ‘మజిలీ’ చిత్రాల్లో కలిసి వెండితెరను పంచుకున్నారు. సమంత నటించిన ‘ఓ బేబీ’లో నాగచైతన్య అతిథి పాత్రలో మెరిశారు.

Leave A Reply

Your email address will not be published.