అయోధ్య రామ మందిరం కోసం విరాళాల సేకరణ

న్యూఢిల్లీ: వచ్చే నెల 15 నుంచి అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం కోసం శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర విరాళాలు సేకరించనుంది. కోట్లాది మంది రామ భక్తులు ఎలా అయితే రామ జన్మభూమి కోసం పోరాటం చేశారో, అలాగే రాముడి గుడి నిర్మించడానికి కూడా సాయం చేయాలని ట్రస్ట్ ఓ ట్వీట్లో కోరింది. దేశవ్యాప్తంగా ఈ విరాళాల సేకరణ ఉంటుందని తెలిపింది. ఈ భారీ ప్రచారంతో కొత్త రామ మందిరానికి చెందిన ఫొటో కూడా దేశంలోని ప్రతి ఇంటికీ చేరుతుందని ట్రస్ట్ చెప్పింది. స్వచ్ఛందంగా రూ.10, రూ.100, రూ.1000 విరాళాలు ఇచ్చేలా కూపన్లను కూడా ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలలో ఈ ప్రచారం నిర్వహించడానికి ట్రస్ట్ సిద్ధమవుతోంది. ఇందులో విశ్వహిందూ పరిషత్ కీలకపాత్ర పోషించనుంది.