Mandapet: ధాన్యం కొనుగోళ్ళు ఆరంభించాలి.. ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట (CLiC2NEWS):– మండపేట నియోజకవర్గ పరిధిలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరంభించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడిన రైతులు విపరీతమైన నష్టాలలో ఉన్నారని పేర్కొన్నారు. పండించిన వరి పంట కొనేవారు లేరని ఆరోపించారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శించారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలని, చేతికి పంట వచ్చిన తరుణంలో వాతావరణం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండటంతో పండించిన పంటను నిల్వ చేసే పరిస్థితి లేదని.. ఏమి చేయాలో దిక్కు తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరంభించాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.